తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా 18 మంది మృతి

తెలంగాణ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసాయి. వాగులు , వంకలు , చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు , పట్టణాలు జలమయయ్యాయి. ముఖ్యంగా వరంగల్ పట్టణంలోని దాదాపు వందలాది కాలనీ లు నీట మునిగాయి. శుక్రవారం నుండి వర్షాలు తగ్గుముఖం పట్టడం తో హమ్మయ్య అనుకుంటున్నారు.

వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది మృతి చెందగా.. 12 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌వ్యాప్తంగా పలువురు మృత్యువాత పడ్డారు. కొండాయి గ్రామానికి చెందిన బంధువులైన ఎనిమిది మంది జంపన్నవాగులో గురువారం గల్లంతు కాగా.. వారి మృతదేహాలు శుక్రవారం బయటపడడంతో విషాదం నెలకొంది.

గురువారం గల్లంతైన మొత్తం 11 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వర్షాల వల్ల విద్యుదాఘాతంతో ఒకరు, చెట్టు ఇంటి గోడపై కూలి మరొకరు కన్నుమూశారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని రామన్నపేట ఎస్సీ కాలనీలో ఓ వ్యక్తి మృతదేహం నీళ్లలో తేలింది. హనుమకొండ గోపాల్‌పూర్‌ చెరువులో లభ్యమైంది. మేడారంలో ఒక యాచకుడి మృతదేహం దొరికింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని వాన వదిలినా.. వరద బెడద మాత్రం వీడలేదు. చాలా వరకు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.