నేడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు నేడు విజయవాడలోని పోరంకిలో జరగబోతున్నాయి. మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పట్లు చేసారు. నేటి సాయంత్రం 4.30 గంటల నుంచి గ్యాలరీల్లోకి ప్రజలను అనుమతిస్తారు. ప్రాంగణం చుట్టూ మరో 20 వేల మంది వరకు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల సావనీర్‌ను విడుదల చేస్తారు. అలాగే, ఎన్టీఆర్‌పై ప్రముఖ జర్నలిస్టు వెంకటనారాయణ రాసిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ నేడు నగరానికి రానున్నారు. అలాగే, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సహా పలువురు నేతలు హాజరవుతారు.