ఢిల్లీ లో వైస్ షర్మిల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ను ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో షర్మిల ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి నినాదాలు చేసుకుంటూ మందుకు సాగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నాయని, ఈ ర్యాలీకి పర్మిషన్ లేదని తెలిపారు. అయినా షర్మిల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో.. ఆమెతో పాటు వైఎస్సార్‌టీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు.

అంతకు ముందు అక్కడి మీడియా తో మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు వ్యయం పెంచారని , కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును ఒక లక్ష 50 వేల కోట్లకు పెంచారని అన్నారు.