రాష్ట్ర భవిష్యత్తును వైఎస్ఆర్సిపి నాశనం చేసిందిః దేవినేని
అమరావతిః వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయిందని టిడిపినేత దేవినేని ఉమ విమర్శించారు. వైఎస్ఆర్సిపి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై తమ యువనేత లోకేశ్ తో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సజ్జలనో, విజయసాయినో చర్చకు పంపుతామంటే కుదరదని… జగనే చర్చకు రావాలని అన్నారు.
టిడిపి హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాల్లా పరుగులు పెట్టాయని దేవినేని ఉమ చెప్పారు. సీఎం జగన్ చిన్నగా ఉన్నప్పుడే అభివృద్ధిని చంద్రబాబు పరిచయం చేశారని తెలిపారు. టిడిపి హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలను వెళ్లగొట్టి, రాష్ట్ర భవిష్యత్తును వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. చెత్తపై కూడా పన్ను వేసిన జగన్ ను ప్రజలు తరిమి కొడతారని అన్నారు.