కేరళ స్కూల్లో ఏఐ టీచరమ్మ పాఠాలు..
తిరువనంతపురంః చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ రాకతో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు చాట్జీపీటీ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా న్యూ టెక్నాలజీ టీచర్లనూ రీప్లేస్ చేసేసింది.
దేశంలోనే తొలి సారి ఏఐ ఆధారిత టీచరమ్మ కేరళలో ప్రత్యక్షమైంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఓ స్కూల్లో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న మహిళా టీచర్ను ప్రవేశపెట్టారు. కొచ్చికి చెందిన ఓ స్టార్ట్అప్, మేకర్ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఏఐ టీచర్ అక్కడి పాఠశాలలో సేవలు అందిస్తోంది. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీర కట్టులో ఈ ఏఐ పంతులమ్మ విద్యార్థులకు చకచకా పాఠాలు బోధించింది. అంతే కాదు వారి సందేహాలను కూడా నివృత్తి చేసింది.
కాగా, మేకర్ల్యాబ్స్ ఎడ్యూటెక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ పంతులమ్మ పేరు ఐరిస్ (Iris). మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. ఈ ఏఐ ఆధారిత టీచర్ దేశంలో మొట్టమొదటి మానవరూప రోబోట్ ఉపాధ్యాయురాలిగా నిలిచింది.