వైఎస్ కుటుంబం చీలిపోవడం జగనన్న చేతులారా చేసుకున్నదేః షర్మిల

జగన్ కు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అండగా నిలబడ్డానని వ్యాఖ్య

ys-sharmila-sensational-comments-on-cm-jagan

అమరావతిః ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం చీలిపోవడానికి జగనే కారణమని ఆమె అన్నారు. దీనికి సాక్షం ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ అని చెప్పారు. కుటుంబం విడిపోవడం అనేది జగనన్న చేతులారా చేసుకున్నదే అని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి కోసం తాను నెలల తరబడి 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టానని చెప్పారు. స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశానని తెలిపారు.

తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, విమర్శిస్తారని తనకు తెలుసని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్సిందంటూ జగన్ నిన్న విమర్శలు గుప్పించిన నేపథ్యంలో… షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు. రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానులో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బిజెపికి జగన్ రెడ్డి బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపికి బానిసగా మారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పణంగా పెట్టారని మండిపడ్డారు.