పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు – సీఎం జగన్

పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున్న ద్రోహి చంద్రబాబు అని సీఎం జగన్ మండిపడ్డారు. రాజధాని పేరుతో గేటెడ్ కమ్యూనిటీ కట్టుకోవాలని చంద్రబాబుతో పాటు గజ దొంగల ముఠా అనుకుందని, దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదలకు ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని మండిపడ్డారు. సోమవారం మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26న పంపిణీ చేస్తామని ప్రకటించారు.

పేదలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన మాటల్లోనే పలుమార్లు బయటపడిందన్నారు. ‘‘ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీల తోక కత్తిరిస్తా అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని మహిళల్ని అవమానించారు. ఇంగ్లీష్ మీడియం వద్దని, రకరకాలుగా దుష్ప్రచారం చేశారు’’ అని ఆరోపించారు. పేదల తలరాతను మార్చాలని నిర్ణయించామ‌ని, అమరావతిలో 50వేల మంది పేదలకు ఈనెల26వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మీ బిడ్డ ప్రజలనే నమ్ముకున్నాడని, మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు హయంలో ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా, వైస్సార్సీపీ ఇస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా కోర్టు కేసులు వేయించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లారు. పెత్తందారీ భావజాలానికి చంద్రబాబు ప్రతీక’’ అని జగన్ ఆరోపించారు.