రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది: కవిత

mlc-kavitha-comments-on-congress-party

జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్టుపల్లి లో మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ తీరుపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉన్నది ఖాకీ రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యమా? రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఫైర్‌ అయ్యారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిని పక్కనపెట్టి, సాధ్యం కానీ హామీలిచ్ఛి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్‌పై అక్రమ కేసులు ముమ్మాటికీ కక్ష్యపూరిత చర్యే అన్నారు. జీవన్ రెడ్డి 30 ఏళ్ల అధికారంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ పదేళ్లలో చేసి చూపించారన్నారు.

జరిగిన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో అక్రమ కేసులు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు తిరగబడతారన్నారు. అమలు కానీ వాగ్ధానాలు ఇచ్చారు. వాటిని ముందు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కక్ష పూరిత చర్యలను ప్రజలు తిప్పి కొడతారన్నారు. యూనివార్సిటీ భూముల విషయంలో విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.