ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాష్‌రెడ్డి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. త్వరలో తాను అరెస్టు కావడం ఖాయమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ముందస్తు బెయిల్ కోరారు.

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు సార్లు సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతంలోనే అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్టు చేయవద్దని తాము ఆదేశాలు ఇవ్వలేమని ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ క్రమంలో త్వరలోనే సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.