లండన్ పర్యటన పూర్తి చేసుకొని ఏపీకి వచ్చిన సీఎం జగన్

సీఎం జగన్ లండన్ పర్యటన పూర్తి చేసుకొని విజయవాడ కు చేరుకున్నారు. ప్రతి ఏడాది పిల్లల కోసం విదేశీ పర్యటన చేయటం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అలవాటే. ఈ క్రమంలో ఈ నెల 02 న సతీసమేతంగా విదేశాలకు వెళ్లే ఆయన.. పది రోజుల పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం ఏపీకి చేరుకున్నారు.

వైసీపీ నేతలు పెద్దయెత్తున గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. లండన్ పర్యటనను ముగించుకుని వచ్చిన జగన్ కు వైసీపీ నేతలు పూల బొకేలు సమర్పించి స్వాగతం పలికారు. లండన్ లో చదువుతున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్ లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, విష్ణు, పార్ధసారధి, ఎంపీ నందిగం సురేష్ లు స్వాగతం పలికారు. వీరితో పాటు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా వచ్చి స్వాగతం పలికారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు, తాజా పరిణామాలు, శాంతి భద్రతలపై సమీక్ష చేయనున్నారని తెలిసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అనంతర పరిణామాలపై జగన్ అధికారులతో పాటు పార్టీ ముఖ్య నేతలతో రివ్యూ చేయనున్నారు.