మరో రెండు నెలల్లో వైజాగ్ రాజధానిగా పాలన – మంత్రి అమర్నాథ్

మరో రెండు నెలల్లో వైజాగ్ రాజధానిగా పాలన కొనసాగుతుందని స్పష్టం చేసారు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాధ్. విశాఖలో జరుగుతున్న ఇన్ఫినిటి వైజాగ్‌ సదస్సు శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సదస్సులో పాల్గొన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ రాజధాని విశాఖపట్నం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ 9వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. త్వరలో అదాని డేటా సెంటర్‌ను విశాఖలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్‌ చేయడమే వైస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు.

ఇక ఏపీలో మూడు రాజధానులపై చర్చ కొనసాగుతూనే ఉంది. విశాఖ కేంద్రంగా పాలనపై మంత్రులు క్లూస్ ఇస్తూనే ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే రాజధాని ఏర్పాటుపై సమయం దొరికినప్పుడల్లా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఏప్రిల్ నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన చేస్తారని గతంలో చెప్పిన మంత్రి అమర్నాథ్, తాజాగా మార్చి నుంచే పాలన ప్రారంభం అంటూ చెప్పుకొచ్చారు. అయితే మూడు రాజధానులపై బిల్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వం… బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.