వివేక హత్య కేసు.. విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

vivekas-murder-case-supreme-court-adjourned-the-trial-for-next-friday

న్యూఢిల్లీః వైఎస్ వివేక హత్య కేసులో రోజురోజుకు కొత్త మలుపులు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందులలో సీబీఐ మరోసారి తనిఖీలు చేయడం మరోసారి కలకలం రేపింది. సోమవారం సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో.. సీబీఐ పులివెందులకు రావడం చర్చనీయంశంగా మారింది. అయితే నేడు సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందోనని తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఐదుగురు జడ్జిలు ఈరోజు అందుబాటులో లేరని పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల వివేకా ఇంటికి సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి పలు వివరాలను సేకరించారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి వద్ద టైపిస్టుగా పని చేసిన ఇనాయతుల్లాను కూడా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం విచారించారు. వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది ఎవరు.దానికి తగ్గట్టు ప్రచారం చేయడంలో మీ పాత్ర ఏంటని వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మరకల్ని భాస్కర రెడ్డి శుభ్రం చేయించారని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయంపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.