ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్

ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ గోదావరి జిల్లాలోని కేపీ పురంలో ఈ పార్క్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రం ఏపీకి లేఖ రాసింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక సైతం పోటీ పడగా.. ఏపీకి ఆ అవకాశం దక్కింది. ఈ మేరకు సీఎస్‌ సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ మంగళవారం లేఖ రాశారు.

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమల్లపురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని లేఖలో ప్రస్తావించారు. బల్క్ డ్రగ్ పార్కుల ప్రోత్సాహక పథకం కింద ప్రతిపాదిత పార్కులో ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం గ్రాంటు అందజేస్తుందన్నారు. స్టీరింగ్ కమిటీ నిర్ణయం ఆమోదయోగ్యమో కాదో 7 రోజుల్లో గా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇక ఈ పార్క్ ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్‌ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.