తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో వర్మ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఈ క్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని… ఓటర్లు మనకు మంచి చేసే అభ్యర్థులనే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవాలని… కానీ, ఓటు మాత్రం మంచి చేస్తాడని నమ్మే వారికే వేయాలని చెప్పారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, ప్రజా సమస్యలు తెలిసిన వారికే ఓటు వేయాలని అన్నారు.

రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను తాను చూడలేదని… అందుకే వాటి గురించి తాను మాట్లాడబోనని వర్మ తెలిపారు. ఇదే సమయంలో ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుండటంపై కూడా ఆయన స్పందించారు. బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తోందని… అయినప్పటికీ, ఈ ఎన్నికలపై జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆసక్తి లేదని చెప్పారు. పవన్ ప్రచారం చేస్తున్న విధానం చూస్తుంటేనే ఇది అర్థమవుతోందని అన్నారు. పవన్ కంటే కూడా కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న బర్రెలక్క చాలా సీరియస్ గా ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చారు.