పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రాహుల్‌ గాంధీ గైర్హాజరు !

విదేశీ పర్యటనకు వెళ్తున్న రాహుల్‌ గాంధీ

rahul-gandhi-foreign-tour-ahead-of-parliament-winter-sessions

న్యూఢిల్లీః వచ్చే నెల 4వ తారీఖు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గైర్హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆయన ఈ సమయంలో విదేశీ పర్యటనకు వెళుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 9వ చేజీ నుంచి రాహుల్‌ గాంధీ ఇండోనేసియా, సింగపూర్‌, మలేసియా, వియత్నాం దేశాల్లో పర్యటిస్తారని ఆ పార్టీ వెల్లడించింది. సింగపూర్‌, మలేసియాలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నట్లు పేర్కొంది. ఇండోనేసియాలో దౌత్యవేత్తలతో భేటీ అవుతారని.. అలాగే వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉందని వివరించింది.

డిసెంబరు 4వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్తుండటం గమనార్హం. గతంలోనూ భారత్‌లో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ.. ఆయన విదేశాల్లో పర్యటించడంతో దీనిపై అప్పట్లో రాహుల్‌ గాంధీపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఇప్పుడు కూడా ఆయన విదేశాల్లో పర్యటనకు సిద్ధమవ్వడం చర్చనీయాంశమవుతోంది.