మణిపుర్ అల్లర్ల అంశం..మోడీకి మద్దతుగా అమెరికన్ సింగర్ ట్వీట్
ప్రధాని మోడీ ఎప్పుడూ భారత ప్రజల స్వేచ్ఛ కోసమే పోరాడుతుంటారు..మేరీ మిల్బెన్
న్యూఢిల్లీః మణిపుర్ అల్లర్ల అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ మేరీ మిల్బెన్ మద్దతు ప్రకటించారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల కోసం మోడీ.. నిత్యం పోరాడుతుంటారని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా చివరగా గురువారం ప్రధాని మాట్లాడారు. అది ముగిసిన కొద్దిసేపటికే మిల్బెన్ ఈ విధంగా ట్వీట్ చేశారు.
నిజం ఏమిటంటే.. భారత ప్రజలకు తమ నేతపైన విశ్వాసం ఉందని మేరీ అన్నారు. మణిపుర్, భారత్కు చెందిన మహిళలు, కుమార్తెలకు న్యాయం అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఎప్పుడూ భారత ప్రజల స్వేచ్ఛ కోసమే పోరాడుతుంటారని.. విపక్షాలు ఎలాంటి విషయం లేకుండా రాద్దాంతం చేస్తుంటాయని వ్యాఖ్యానించారు.
విదేశాల్లో తన దేశాన్ని అగౌరవపరచడం నాయకత్వం కాదని హితవు పలికారు. కానీ నిజం ఎల్లప్పుడూ ప్రజలు స్వేచ్చగా ఉండేలా చూస్తుందని మిల్బెన్ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. అలాగే తనకు ప్రధాని మోడీపై విశ్వాసం ఉందని, ఆయన కోసం ప్రార్థిస్తానన్నారు. స్వేచ్ఛ గురించి ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన కోట్ను ప్రస్తావించారు.