ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైన బిజెపి నేత
లక్నోః ఉత్తరప్రదేశ్లో బిజెపి నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అనుజ్ చౌదరి (34) గురువారం సాయంత్రం సమయంలో మొరదాబాద్ లోని తన అపార్ట్మెంట్ వద్ద ఓ వ్యక్తితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు చౌదరిపై కాల్పులు జరిపారు. దీంతో అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో చౌదరితో కలిసి నడుస్తున్న వ్యక్తి అక్కడి నుంచి భయంతో పరుగున వెళ్లిపోయాడు. అనంతరం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు బైక్ దిగి చౌదరిపై వరుసగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతన్న అనుజ్ చౌదరిని స్థానికులు వెంటనే మొరదాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతనకు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు అమిత్ చౌదరి, అనికేత్లు అనుజ్ చౌదరి కుటుంబ సభ్యులే అని అనుమానిస్తున్నారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్లు చౌదరి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.