దేశంలో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందిః తోట చంద్రశేఖర్

ఏపీలో బిఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది.. తోట చంద్రశేఖర్

brs-will-contest-in-all-seats-in-ap-says-thota-chandrasekhar

అమరావతిః ఏపిలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని బిఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని అన్నారు. ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించారని అన్నారు. దేశ చరిత్రను తిరగరాసే అనేక సందర్భాలకు బిఆర్ఎస్ కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు.

దేశ ప్రజల మధ్య బిజెపి మత విద్వేషాలను సృష్టిస్తోందని తోట చంద్రశేఖర్ విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయిందని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడగలిగే సత్తా, ధైర్యం కేవలం కెసిఆర్ కు మాత్రమే వున్నాయని చెప్పారు. ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు.