నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో టీసీపై యువకుల దాడి

అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్ప్‌ప్రెస్ రైలులో టికెట్ అడిగినందుకు టీసీ ఫై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

కిరణ్‌ కుమార్‌ బల్లార్షా నుంచి విజయవాడ వరకు టీసీగా విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో మహబూబాబాద్‌కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్‌కు చెందిన మోతిపట్ల సుమన్‌ టికెట్‌ లేకుండా ఎస్‌-1 బోగిలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్‌ అడిగినందుకు ఇద్దరు కిరణ్​తో గొడవ పడ్డారు. గొడవ ముదిరి చివరకు ఇద్దరూ కలిసి టీసీపై దాడికి పాల్పడ్డారు.

తోటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సీటీఐ శ్రీరాం టీసీ కిరణ్‌కుమార్‌ను మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన రవితేజ, సుమన్ పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, దాడి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.