ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందంటూ బిజెపి చేస్తున్న ఆరోపణల ఫై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడుతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడరన్నారు. ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు. కేసీఆర్ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.
కేసీఆర్ కుమార్తెను కాబట్టే నా పైనా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్ ఉద్యమాన్నినడిపించారన్నారు. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు కవిత. మరి కవిత చేసిన కామెంట్స్ ఫై బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.