టీ-24 టికెట్‌ ధర పెంచిన TSRTC

నిత్యం ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్లతో ఆకర్షిస్తున్న TSRTC ..తాజాగా హైదరాబాద్ నగరవాసులకు మాత్రం షాక్ ఇచ్చింది. గ్రేటర్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్‌ ప్రస్తుత ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్‌ ధరను రూ.90 నుంచి రూ.100కి పెంచింది. సీనియర్‌ సిటిజన్ల (పురుషులు, మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలు)కు రూ.80 ఉండగా రూ.90 చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు జూన్‌ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో టీ-24 టికెట్‌ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్‌ 26న రూ.90కి తగ్గించింది. సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి అందించింది.