నాలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కంపించిన భూమి

తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రకంపనలు

tremors-in-four-states

న్యూఢిల్లీః భారత్ నలుమూలలా నేడు భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో నేడు భూప్రకంపనలు వచ్చాయి. మొదట కర్ణాటకలో ఉదయం 6.52 గంటలకు భూమి కంపించింది. రాష్ట్రంలోని విజయపురలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది.

ఆ తర్వాత మరో 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చెంగల్పట్టులో భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ 3.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అనంతరం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ఉదయం 8.46 గంటలకు భూకంపం రాగా, ఉదయం 9 గంటలకు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. షిల్లాంగ్ లో 3.8 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వివరాలు తెలిపింది.