విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన సీఎం జగన్
రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
అమరావతిః విజయనగరం జిల్లాలో గత రాత్రి రెండు రైళ్లు ఢీకొనడం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. పెద్ద ఎత్తున గాయపడగా, క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ విజయనగరంలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడినవారిని పరామర్శించారు. దుర్ఘటన జరిగిన తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫొటోలను పరిశీలించారు. అనంతరం సీఎం జగన్ తన పర్యటనపై సోషల్ మీడియాలో స్పందించారు.
“విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాను. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. వారు కోలుకునేంత వరకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించాలని, మరణించినవారి కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా వెంటనే అందించాలని అధికారులను ఆదేశించాను” అని వెల్లడించారు.