ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ తీపి కబురు

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మూసివేసిన ‘స్టాఫ్‌ బినవొలెంట్‌ త్రిఫ్ట్‌ (ఎస్‌బీటీ) ఫండ్‌’ను తిరిగి కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ తో ఎస్ బి టి ఫండ్ ను గతంలో కొన్నేళ్ల పాటు నిర్వహించారు.

దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా…పదవి విరమణ పొందినా ఈ నిధి నుండి లక్షా యాభై వేల చొప్పున చెల్లించేవారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఎస్ బి టి ఫండ్ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం అమల్లోకి వచ్చింది. అయితే ఇది 55 ఏళ్ల లోపు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దాంతో 55 ఏళ్లు దాటిన ఉద్యోగులు కోసం ఆర్టీసీ మళ్లీ ఎస్ బి టి ఫండ్ ను అమల్లోకి తెచ్చింది. ఈ ఫండ్‌ 2021 డిసెంబర్‌ నాటికి 55 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వర్తిస్తుంది. ఆ ఉద్యోగుల నుంచి నెలకు రూ.100 చొప్పున కంట్రిబ్యూషన్‌ వసూలు చేస్తారు. ఈ మేరకు రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.