అమలాపాల్ ను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్న సిబ్బంది

నటి అమలాపాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్తుండగా ఆమెను లోనికి వెళ్లకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలో చోటుచేసుకుంది. మహాదేవ ఆలయంలో హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్యమతస్తులకు ప్రవేశం ఉండదు. ఈ నేపథ్యంలో ఆలయ సందర్శనకు వచ్చిన నటి అమలాపాల్‌ ను ఆలయ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాసుకొచ్చారు.

తాను అమ్మవారిని చూడలేకపోయినా ఆత్మను అనుభవించానని అమలాపాల్ ఆ రిజిస్టర్‌లో రాశారు. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోకి తనను అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు. తాను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించానని, మతపరమైన వివక్షలో త్వరలోనే మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.

ఇక అమలాపాల్ సినిమాల విషయానికి వస్తే ..తెలుగు లో బెజవాడ సినిమాతో రంగప్రవేశం చేసిన ఈమె..ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దీంతో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ..ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది.