సియర్రా లియోన్ లో ఘోర ప్రమాదం…91 మంది మృతి

ఫ్రీటౌన్ : ఆఫ్రికా దేశం సియర్రా లియోన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని ఫ్రీటౌన్ లో గోయిత్రమ్ సూపర్ మార్కెట్ సమీపంలో చమురు ట్యాంకర్ ఓ లారీని ఢీకొట్టి రోడ్డుపై నిలిచిపోయింది. ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవుతుండగా, ప్రజలు దాన్ని సేకరించేందుకు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఆ ట్యాంకర్ ఉన్నట్టుండి పేలిపోవడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. ఈ ఘటనలో 91 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. 100 మంది వరకు ప్రజలు క్షతగాత్రులయ్యారు.

పేలుడు ధాటికి సమీపంలోని షాపులు, పాదచారులకు కూడా మంటలు అంటుకున్నాయి. మృతులు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. వారి శరీర భాగాలు విసిరేసినట్టుగా చెల్లాచెదురుగా పడ్డాయి. ఘటనా స్థలం బీభత్సంగా మారిపోయింది. ఈ ఘటనపై సియర్రా లియోన్ అధ్యక్షుడు జూలియన్ మాడా బియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/