తెలంగాణ లో రెచ్చిపోతున్న దొంగలు

తెలంగాణ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎటిఎం లు , వైన్ షాప్స్ లు ఏది వదిలిపెట్టకుండా లూటీ చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి 29 లక్షల రూపాయల నగదును అపహరించినట్లు తెలుస్తున్నది. ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకుసుకు వచ్చిన వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని సీఐ రవికుమార్, ఎస్ఐ ఉపేందర్ పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. బ్లాక్ కారులో వచ్చిన ఆరుగురు నిందితులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇక జహీరాబాద్‌లో పట్టణంలోని మార్కెట్‌ ఏరియాలో ఉన్న ఐదు బట్టల దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. దీంతోపాటు మరో నాలుగు మద్యం షాపుల్లో దొంగతనం చేశారు. షెట్టర్లు పగలగొట్టి షాపుల్లో ఉన్న నగదు, విలువైన సామగ్రి ఎత్తుకెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.