జనగాం కస్తూర్భా గాంధీ బాలికల హాస్టల్‌లో బల్లి పడిన ఆహారాన్ని అందించారు

ఈ మధ్య ప్రభుత్వ హాస్టల్స్ లలో పిల్లలకు అందించే ఆహారం ఏమాత్రం నాణ్యతగా ఉండడంలేదు. రాత్రి వండిన ఆహారాన్నే తెల్లారి పెడుతుండడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నారు. అంతే కాదు పురుగులు పట్టిన బియ్యం , బల్లులు పడిన ఆహారాన్ని పిల్లలకు అందజేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే పలు చోట్ల జరుగగా..తాజాగా జనగాం జిల్లాలోని కస్తూర్భా గాంధీ బాలికల హాస్టల్‌లో విద్యార్థులకు బల్లి పడిన ఆహారాన్ని అందజేశారు. దీంతో ఆహారం తిన్న కొందరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

జనగాం జిల్లా, దేవరుప్పుల గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ) లో విద్యార్థినులకు గురువారం రాత్రి అందించిన ఆహారంలో బల్లి పడింది. దోసకాయ పచ్చడిలో బల్లి రావడాన్ని విద్యార్థులు గమనించారు. ఆలోపే కొందరు విద్యార్థులు ఆ పచ్చడి తిన్నారు. దీంతో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను స్థానిక జనగామ ప్రభుత్వాసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అయితే, ఆహారంలో బల్లి రావడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. బల్లి పడిందని చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు.