బిజెపై మరోసారి ఉద్ధవ్ థాకరే విమర్శలు

ఎన్డీయేలో ఈడీ, ఐటీ, సీబీఐలే బలమైన పార్టీలన్న థాకరే

uddhav thackeray
uddhav thackeray

ముంబయిః బిజెపిపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో ఉన్న మూడు బలమైన పార్టీలు ఈడీ, ఐటీ, సీబీఐ అని ఆయన ఎద్దేవా చేశారు. సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజెపిపై థాకరే మండిపడ్డారు. ఓవైపు మణిపూర్ జాతుల మధ్య వైరంతో రగిలిపోతుంటే ఇంత వరకు ప్రధాని మోదీ అక్కడకు వెళ్లలేదని విమర్శించారు. అక్కడకు వెళ్లే ఆలోచనలో కూడా ఆయన లేరని దుయ్యబట్టారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంపై థాకరే స్పందిస్తూ… ఎన్నికలు సమీపించినప్పుడు వారికి అది ఎన్డీయే ప్రభుత్వంగా ఉంటుందని… ఎన్నికలు పూర్తి కాగానే మోదీ ప్రభుత్వంగా మారిపోతుందని విమర్శించారు. ఎన్డీయేలో 36 పార్టీలు ఉన్నప్పటికీ… ఈడీ, ఐటీ, సీబీఐ మాత్రమే బలమైన పార్టీలని చెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ కూడా లేరని ఎద్దేవా చేశారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ పై థాకరే స్పందిస్తూ… చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పినప్పుడు… అవినీతిపరులైన బీజేపీ నేతలను తొలుత శిక్షించాలని అన్నారు. థాకరే కుటుంబం ఉన్న పార్టీనే అసలైన శివసేన అని చెప్పారు.