ఏపిలో పంచాయతీ ఎన్నికల పోలింగ్..వైఎస్ఆర్సిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ దాడిచేయిస్తున్నారన్న టిడిపి
అమరావతిః నేడు ఏపిలో 35 సర్పంచ్, 245 వార్డు సభ్యుల స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంటలో వైఎస్ఆర్సిపి, టిడిపి కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలే తమపై దాడికి పాల్పడ్డారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గురుండి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బొప్పడంలో వైఎస్ఆర్సిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన టిడిపి కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. కాగా, మధ్యాహం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. రెండు గంటలకు ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.