స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్ః హైదరాబాద్ వీఎస్టీ ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక హైదరాబాద్లో 36వ ఫ్లై ఓవర్ ఇది అన్నారు. ఇందిరాపార్క్ను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని చెప్పారు. నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని.. స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని కెసిఆర్ ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
స్టీల్ బ్రిడ్జికి రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే.
దక్షిణ భారత దేశంలోనే అతిపొడవైన స్టీల్ బ్రిడ్జ్గా ఈ వంతెన పేరు గాంచింది. రూ.450 కోట్ల వ్యయంతో స్టీల్ బ్రిడ్జ్ను సర్కార్ నిర్మించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా మెట్రో బ్రిడ్జిపై నుంచి స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జితో ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఉస్మానియా వర్శిటీ, హిందీ వర్శిటీ వరకు వెళ్లే ప్రయాణికులకు సమయం తగ్గనుంది.