అక్కడి ఓటును రద్దు చేసుకుని ఇక్కడే తీసుకోండి: కార్మికులకు హరీశ్ రావు సూచన

రెండు రాష్ట్రాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని వెల్లడి

telangana-minister-harish-rao-advice-to-ap-labour-about-voter-registration

హైదరాబాద్‌ః సంగారెడ్డిలో జరిగిన మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలోని 9వ వార్డులో రూ.20 లక్షలతో కార్మికుల భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..ఏపీలో కనీసం రోడ్లు కూడా సరిగా లేవని చెప్పారు. అక్కడి రోడ్లు, దవాఖానాల పరిస్థితి మీకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. మేడే రోజున కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

‘ఆంధ్రాలో పాలన ఎలా ఉందో మీకు తెలుసు.. అక్కడికి వెళ్లినపుడు మీరు చూస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మరి అక్కడా ఇక్కడా ఓటు ఎందుకు? అక్కడి ఓటును రద్దు చేసుకుని ఇక్కడే తీసుకోండి’ అంటూ ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ కార్మికులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. ఒక దిక్కే ఓటు పెట్టుకోండి. అదీ తెలంగాణలోనే పెట్టుకోండని మంత్రి చెప్పారు.