తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే

తెలంగాణ లోని 17 స్థానాలకు జరిగిన లోక్ సభ పోలింగ్ కు సంబదించిన ఫలితాలు ఈరోజు వెల్లడైయ్యాయి. ఈ ఫలితాల్లో బిజెపి 8 , కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించగా..AMIM హైదరాబాద్ స్థానంలో విజయం సాధించింది. ఇక బిఆర్ఎస్ కనీసం ఖాతా తెరవకపోవడం ఆ పార్టీ నేతల్లో , శ్రేణుల్లో నిరాశ నింపింది.

ఇక గెలిచిన అభ్యర్థులను చూస్తే..

ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి 4 లక్షల 62 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్ధి, బీఆర్​ఎస్​ సిట్టింగ్‌ ఎంపీ నామ నాగేశ్వరరావును ఓడించారు. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కుందురు రఘువీర్‌రెడ్డి విజయదుందుభి మోగించారు. వరంగల్‌లో కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్య రెండు లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ బీఆర్​ఎస్​ అభ్యర్థి కవితపై 3 లక్షల 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.

జహీరాబాద్‌లో కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి లక్షా 95 వేల ఓట్ల పైచిలుకు తేడాతో గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్​ అభ్యర్థి మల్లు రవి 88 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ లక్షా 31 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. జహీరాబాద్‌లో సురేశ్‌ షెట్కార్‌ 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌ 3 లక్షల 80 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. సికింద్రాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీప ప్రత్యర్థి దానం నాగేందర్​పై 52 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ సమీప ప్రత్యర్థి వినోద్‌కుమార్‌పై రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. మెదక్ లోక్‌సభ స్థానంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 32 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుపై విజయం సాధించారు.

నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్‌ లక్షా 9 వేల 241 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి జీవన్‌రెడ్డిపై ఘనవిజయం సాధించారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గోడం నగేశ్ సమీప ప్రత్యర్థి ఆత్రం సుగుణపై 78 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రంజిత్‌రెడ్డిపై విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఉత్కంఠభరిత పోరులో డీకే అరుణ 4 వేల ఓట్లకు పైచిలుకు స్వల్ప తేడాతో సమీప ప్రత్యర్థి వంశీచంద్ రెడ్డిపై గెలుపొందారు.