తెలంగాణ టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్

తెలంగాణ టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. మల్టీజోన్‌-2 బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లాలోని కొందరు టీచర్లు సీనియార్టీ జాబితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం రోజున విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ 13 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి కొంతమంది టీచర్లు వచ్చినందున సీనియార్టీ జాబితాలను రూపొందించాలని హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. ఈ కేసుపై అక్టోబర్‌ 10 వరకు స్టే విధించింది.

మల్టీజోన్‌ -1లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గెజిటెడ్‌ హెచ్‌ఎంల బదిలీలు ముగిశాయని.. తాజాగా స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా (జీహెచ్‌ఎం) పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ, తుది జాబితాలు, జీహెచ్‌ఎం పోస్టుల ఖాళీల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ జాబితాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు గురువారం వరకు అవకాశం ఇచ్చారు.