ముగిసిన తెలంగాణ క్యాబినెట్ భేటీ… పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భేటీ అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే తొలి విడత అమలు చేశామని, త్వరలోనే రెండు విడత చేపడతామని చెప్పుకొచ్చారు. గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆయా ఇండ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించింది. కటాప్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. జీవో 58,59 కింద కొద్ది మంది మిగిలిపోయిన వారు మేం గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయాం, కటాఫ్‌ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, పేదలకు అందరికీ ఇండ్లపై హక్కులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రేమతో.. వారందరికీ చివరిసారిగా అవకాశం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్‌ థియేటర్‌ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి.. లక్షలాది మంది మధ్య అంబేడ్కర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని హరీశ్‌ రావు తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.