యూపీలో మరో దారుణం : బాలికకు శానిటైజర్ తాగించడంతో మృతి

క్రైం కు ఉత్తరప్రదేశ్ పెట్టింది పేరు. నిత్యం ఇక్కడ అత్యాచారాలు , దాడులు , హింసలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రతి రోజు ఇదొక క్రైమ్ న్యూస్ తో యూపీ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల స్కూల్ విద్యార్థినికి నలుగురు యువకులు శానిటైజర్ తాగించడంతో ఆ బాలిక చనిపోయింది. ఈ ఘటన కు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో ఈ విషయం బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

బరేలీకి చెందిన విద్యార్థిని (16) జులై 27న స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మఠ్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన ఉదేశ్ రాథోడ్ (21) అడ్డుకుని వేధించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులు అక్కడికి వచ్చి సదరు బాలికను వేధించడం మొదలుపెట్టారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడిచేశారు.

ఆ తర్వాత బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న( సోమవారం ) మృతి చెందింది. ఈ ఘటన ఫై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను వెతికే పనిలో ఉన్నారు.