ఇంటింటికి వెళ్లి పేపర్ వేసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

టిడ్కో ఇళ్ల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ పేపర్ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే

tdp-mla-nimmala-rama-naidu-distributed-newspapers-in-palakollu

అమరావతిః పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆదివారం ఉదయం ఇంటింటికి దినప్రతికలు అందించే వ్యక్తిగా అవతారమెత్తారు. టిడ్కో ఇళ్లలో మిగిలిన పదిశాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ఆయనిలా పేపర్ బాయ్‌గా మారారు. పట్టణంలోని మావుళ్లమ్మపేటకు చేరుకున్న ఎమ్మెల్యే.. స్థానిక పేపర్ బాయ్స్‌తో కలిసి సైకిలుపై ఇంటింటికీ వెళ్లి చందాదారులకు పేపర్లు పంపిణీ చేశారు.

31వ వార్డులోని నాగరాజుపేట సహా పలు ప్రాంతాల్లో పేపర్ వేశారు. దినపత్రిక తీసుకునేందుకు వచ్చిన వారికి టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. పట్టణవాసులకు పది కిలోమీటర్ల దూరంలో టిడ్కో ఇళ్లు కేటాయించడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా దినపత్రికలు వేస్తూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి వారికి తెలియజేస్తానన్నారు. అలాగే, మరో నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతానని ఎమ్మెల్యే వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/