ఏపీ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ ఆందోళ‌న‌

ప‌లు జిల్లాల్లో నేతల హౌస్ అరెస్ట్

అమరావతీ: ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. సింహాద్రిపురం నుంచి పులివెందుల వెళ్తున్న బీటెక్ ర‌విని పోలీసులు అడ్డ‌గించారు. అనంత‌రం ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఐల్యాండ్ సెంట‌ర్ వ‌ద్ద టీడీపీ ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. ఎద్దుల బండితో ట్రాక్ట‌ర్ లాగుతూ నిర‌స‌న తెలిపింది. ఈ ఆందోళ‌న‌లో టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర కూడా పాల్గొన్నారు.

క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో పెట్రోల్ బంకుల వ‌ద్ద టీడీపీ నేత‌లు అందోళ‌న చేస్తున్నారు. ప‌లువురిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో పెట్రోల్ ధరలు ఉన్నాయని, వాటిని వెంటనే తగ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ భవానీపురంలో ఆ పార్టీ శ్రేణులు పెట్రోల్ బంకుల ముందు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కర్నూలులోని గాయత్రీ ఎస్టేట్ నుంచి మెడికల్ కళాశాల పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు.

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించమంటే రాష్ట్ర ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోంద‌ని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మండిపడ్డారు. ప్రజలపై అధిక భారం వేస్తున్న ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంద‌ని చుర‌క‌లంటించారు. అరాచక, ఆటవిక చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, పెట్రోల్, డీజిల్ ధరలు దిగాలి అంటే జగన్ దిగాలని ఆయ‌న అన్నారు. మరోపక్క, రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కొంద‌రు టీడీపీ నేత‌ల‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని నిర్బంధాలు విధించిన త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/