తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరం..

chandrababu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ పార్టీ దూరంగా ఉండనుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు పార్టీ అధినేత చంద్రబాబు సూచించినట్టు తెలుస్తుంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. శనివారం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ములాఖత్‌ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు.

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్‌ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి. ఏపీలో మనం విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి తేలిగ్గా బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. మనం సర్వసన్నద్ధంగా ఉండి పోరాడితే మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం’’ అని తెలిపినట్లు సమాచారం.