చైనాలోని కిండర్ గార్టెన్లో కత్తిపోట్లు.. ఆరుగుర్ని పొడిచి చంపిన యువకుడు
బాధితుల్లో టీచర్, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురి మృతి
బిజీంగ్ః చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ కిండర్గార్టెన్లోకి ప్రవేశించిన 25 ఏళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిని ఉద్దేశపూర్వకదాడిగా పేర్కొన్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒక టీచర్, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారని, మరో వ్యక్తి గాయపడ్డాడని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.40 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఆ వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. చైనాలో ఇటీవలి కాలంలో కత్తిపోట్ల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్కూళ్లే లక్ష్యంగా దుండగులు దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో జియాంగ్ఝి ప్రావిన్సులోని కిండర్గార్టెన్లో ఓ వ్యక్తి కత్తితో దాడిచేసి ముగ్గురిని హతమార్చాడు. మరో ఆరుగురిని గాయపరిచాడు.