రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందిః రఘురామకృష్ణ రాజు

raghu ramakrishna-raju

అమరావతిః సామాజిక సాధికార సభలో కనిపించిన ఖాళీ కుర్చీలతోనే రానున్న ఎన్నికల్లో తమ వైఎస్‌ఆర్‌సిపి పార్టీ పరిస్థితి ఏమిటన్నది అర్థం అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఇంక జగన్ మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకోవడం ఎందుకు… డబ్బులు దండగ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కృషితో కూటమిలో మూడవ పార్టీ చేరే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఆ పార్టీ కూటమిలోకి వస్తే అధికార తమ పార్టీ అరాచకాలు చేసే అవకాశం ఉండదని, ఒకవేళ ఆ పార్టీ కూటమిలోకి రాకపోయినప్పటికీ, పబ్లిక్ పల్స్ తెలిసిపోయింది కాబట్టి, ఎవరు చెప్పినా పోలీసులిక అరాచకాలు చేయరని అన్నారు . తెనాలిలో నిర్వహించిన సామాజిక సాధికార సభ వేదికపై నాయకులు అధికంగా ఉంటే, సభకు జనం కరువయ్యారని, సామాజిక సాధికార సభ వేదికపైకి ఎక్కేందుకు రెడ్డి నాయకులు మొహమాట పడినట్లు కనిపిస్తుందని అన్నారు. ఒకవేళ రెడ్డి నాయకులు సభా వేదిక పైకి చేరుకుని ఉంటే, కొంత మంది బీసీ, ఎస్సీ నాయకులు వాళ్ల కాళ్ల మీద పడతారిమోనని వై.వి. సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి గారి లాంటి నాయకులు సభా వేదిక కిందే ఉండిపోయారేమోనని అన్నారు. తిరుపతిలో సామాజిక సాధికార సభ ఎలా నిర్వహిస్తారో చూడాలని ఉందని చెప్పారు.