మరోసారి సమావేశమైన టిడిపి, జనసేన అగ్రనేతలు
ఉమ్మడి, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/11/tdp-and-janasena-coordination-committee-held-meeting-in-vijayawada-jpg.webp)
విజయవాడ: ఏపీలో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో, ఉమ్మడి కార్యాచరణ కోసం టిడిపి-జనసేన సమన్వయ కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలి సమావేశం ఇటీవల రాజమండ్రిలో జరగ్గా, టిడిపి తరఫున నారా లోకేశ్, అచ్చెన్నాయుడు… జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు.
ఈరోజు విజయవాడలో టిడిపి-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం జరిగింది. నోవోటెల్ హోటల్ లో జరిగిన ఈ కీలక భేటీకి టిడిపి నుంచి నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర సీనియర్ నేతలు హాజరు కాగా… జనసేన తరఫున నాదెండ్ల, తదితర అగ్రనేతలు విచ్చేశారు.
ఉమ్మడి, పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా నేటి సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యపోరాటం, ఓటరు జాబితా అవకతవకలపై ఉమ్మడి పోరుకు 100 రోజుల కార్యాచరణకు ప్రణాళిక రూపకల్పన దిశగా చర్చలు సాగాయి.