సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు సర్కారు, ఉదయనిధి స్టాలిన్, ఏ రాజాలకు నోటీసులు జారీ

supreme-court-notice-to-udhayanidhi-stalin-14-others-for-sanatana-dharma-remarks

న్యూఢిల్లీః సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజా, మరో 14 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టేయాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు గాను, ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందన తెలియజేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు శాఖ, సీబీఐ, ఏ రాజా, తదితరులకు నోటీసులు జారీ చేసింది.

ఉదయనిధి స్టాలిన్ ఈ నెల 2న సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేశారు. డెంగీ, మలేరియాతో పోల్చారు. దీన్ని కేవలం వ్యతిరేకించడం కాకుండా, సమాజం నుంచి నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సనాతన నిర్మూలన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఉదయనిధి ఈ విధంగా మాట్లాడారు. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమన్నారు. ‘‘కొన్నింటిని వ్యతిరేకించకూడదు. నిర్మూలించాలంతే. మనం డెంగీ, దోమలు, మలేరియా, కరోనాను వ్యతిరేకించకూడదు. వాటిని తుడిచి పెట్టేయాలి. అదే మాదిరిగా సనాతనాన్ని కూడా నిర్మూలించాలి’’అని ఉదయనిధి పేర్కొనడం గమనార్హం. డీఎంకే ఎంపీ ఏ రాజా అయితే మరో అడుగు ముందుకు వేసి సనాతన ధర్మాన్ని ఎయిడ్స్ వ్యాధితో పోల్చారు.