నేడు ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం
హైదరాబాద్ మహానగరంలో ఈరోజు నుండి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రాబోతుంది. ట్రాఫిక్ తో నగర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో, ఫ్లైఓవర్స్, స్కై సిటీస్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి కాస్త నగరవాసులకు ఉపశమనం కలిగించింది. ఇక ఇప్పుడు నిత్యం రద్దీ గా ఉండే ఎల్బీనగర్లో ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు ప్రభుత్వం ఫ్లై ఓవర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ను శనివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్ వైపు వచ్చే దారిలో ఎల్బీనగర్ కూడలిలో కుడివైపు నిర్మితమైన వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. రూ.32 కోట్ల వ్యయంతో 760 మీటర్ల పొడవు, 12 మీటర్లు వెడల్పుతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్నగర్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లొచ్చు.