ఏపీలో నిధుల దారి మ‌ళ్లింపును నిలుపుద‌ల చేసిన సుప్రీంకోర్టు

ఎస్డీఆర్ఎఫ్ నిధుల‌ను పీడీ ఖాతాల‌కు మ‌ళ్లించిన ఏపీ ప్ర‌భుత్వం
ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు

న్యూఢిల్లీ : ఏపీ సర్కార్ నిధుల వినియోగానికి సంబంధించి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఓ ప‌నికి నిర్దేశించిన నిధుల‌ను ఇత‌ర‌త్రా ప‌నుల‌కు మ‌ళ్లిస్తూ జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోగా.. ఆ నిధుల మ‌ళ్లింపును నిలుపుద‌ల చేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం నాడు సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్‌) కింద కేటాయించిన నిధుల‌ను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తూ పీడీ ఖాతాలకు స‌ద‌రు నిధుల‌ను మ‌ళ్లించింది. ఈ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు దానిపై బుధ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాదంటూ కోర్టుకు తెలిపింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా ఎస్టీఆర్ఎప్ నిధుల‌ను దారి మళ్లించ‌డం కుద‌ర‌ద‌ని కూడా తేల్చి చెప్పింది. అంత‌టితో ఆగ‌కుండా నిధులు మ‌ళ్లిస్తూ ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 28కి వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/