డిసెంబర్ లోగా అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం : మంత్రి కేటీఆర్
పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్య
హైదరాబాద్: హైదరాబాద్లోని పీవీ మార్గ్లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ లోగా ప్రతిష్టిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీవీ మార్గ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహా పనులను కేటీఆర్ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ లోగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. గత ఎనిమిది నెలలుగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఇక్కడ పర్యాటక రంగాన్ని ఆకర్షించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ సాధ్యమైందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ మహనీయుడు కలలుగన్నట్టు అందరికీ మేలు జరగాలని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/