ఫార్మాసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో కోణం
పేగులు, కాలేయం పాడవడంతో మృతి?
ఆమెతో పూజలు చేయించిన తల్లిదండ్రులు?
హైదరాబాద్: ఘట్కేసర్లో ఓ బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం డ్రామాలు ఆడి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె రెండు రోజుల క్రితం మృతి చెందింది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండడం, రేప్ డ్రామా ఆడినందుకు తన పరువుపోతుందనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆమె ఆత్మహత్య కేసులో ఇంకా స్పష్టతరాలేదని పోలీసులు చెప్పారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. కిడ్నాప్ డ్రామా ఆడిన అనంతరం ఆ విద్యార్థిని సరిగ్గా ఆహారం తీసుకోలేదని తెలిసింది. అంతేగాక, ఆమెను కొన్ని రోజులుగా చీకట్లో ఉంచి ఆమె తల్లిదండ్రులు 11 రోజులు పూజలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె పేగులు, కాలేయం దెబ్బతిందని, అందుకే మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
ఆమె కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు మరోలా ఉన్నాయి. ఆ విద్యార్థిని మంగళవారం పలు మాత్రలు మింగిన విషయం తెలిసిందే. విద్యార్థిని తండ్రి తన షుగర్, బీపీ మాత్రలు వేసుకుందామని ఆ మాత్రలు ఉండే కవరుని తెరిచారు. అయితే, అందులో 15 మాత్రలు తక్కువగా ఉన్నట్లు తెలిసింది.
బుధవారం ఉదయం విద్యార్థిని నోటి వద్ద నురగలు కనపడడం, స్పృహ లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆమె అమ్మమ్మ ఇంటివద్ద విద్యార్థిని అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్య కేసులో మరిన్ని విషయాలను తేల్చడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/