TSPSC వద్ద విద్యార్థి సంఘాల ఉద్రిక్తత

హైదరాబాద్ TSPSC వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి.. పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేసి , గేట్లు దూకారు.. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఎగ్జామ్ పేపర్లను అమ్ముకుంటూ నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే . పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారని వాపోయారు.

ఇంజినీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే.. గ్రూప్ వన్, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. పరీక్షల పేపర్లును కాపాడుకోకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు. ఈ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉస్మానియా వ‌ర్శిటీలో కూడా విద్యార్ధులు నిర‌స‌న ఆందోళ‌న చేపట్టారు.. వ‌ర్శిటీ రోడ్ల‌పై బైఠాయించారు.. ఈ లీకేజ్ ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు..