శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు.. 21 గేట్లు ఎత్తివేత్త

sriram-sagar-project-21-gates-lifted-by-irrigation-officials

నిజామాబాద్ : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు నిండుకుండ‌లా మారింది. వ‌ర‌ద భారీగా కొన‌సాగుతుండ‌టంతో.. ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 89,094 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్ర‌స్తుత‌, పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 1091 అడుగులుగా ఉంది. ప్ర‌స్తుత‌, పూర్తి స్థాయి నీటినిల్వ 90 టీఎంసీలుగా ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వాలింది. ఈ అల్పపీడనం 24 గంటల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గడ్‌ మీదుగా కదిలే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.