యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న సోమేశ్కుమార్ దంపతులు
సీఎం కేసీఆర్కు ప్రధాన సలహాదారుడిగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ బుధవారం యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి ని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సోమేశ్కుమార్ దంపతులను సన్మానించారు.
గతంలో సోమేశ్కుమార్ తెలంగాణ సీఎస్గా పని చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక రకాలు ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కేసీఆర్ సలహాదారుగా చేరుతారని లేదా రెరా చైర్మన్ అవుతారని లేదా బీఆర్ఎస్లో చేరి ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.